ప్రకాష్ రాజ్, రావు రమేష్ లకు ఆల్టర్నేట్ ఎవరొస్తున్నారు?
హీరోలను ఆకాశానికి ఎత్తాలన్నా, కథను ఎమోషనల్గా నడిపించాలన్నా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా పవర్ఫుల్ విలన్ కచ్చితంగా ఉండాలి. టాలీవుడ్లో హీరోలకు ఏమాత్రం కొరత లేదు, కానీ బలమైన క్యారెక్టర్లు చేయగలిగిన నటుల కొరత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, ఎస్వీ రంగారావు లాంటి వారు చేసిన మ్యాజిక్.. ఇప్పుడు ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ, జగపతి బాబులు కంటిన్యూ చేస్తున్నారు. ఏ పెద్ద సినిమా తీసుకున్నా తండ్రి, విలన్ లేదా మంత్రి పాత్రలకు వీరి పేర్లే ముందుగా వినిపిస్తాయి. మరి వీరికి ప్రత్యామ్నాయం ఎవరు?
పరభాషా నటులపై ఆధారపడుతున్న పాన్ ఇండియా! మన సినిమాలు ఇప్పుడు కేవలం తెలుగుకే పరిమితం కాలేదు, పాన్ ఇండియా రేంజ్కి వెళ్లాయి. దాంతో అన్ని భాషల ఆడియన్స్కు తెలిసిన ముఖాలు కావాలని మన దర్శకులు బాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారు. ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ (‘హరిహర వీరమల్లు’, డాకు మహారాజు,ఠె రాజాసాబ్, సంజయ్ దత్ (‘డబుల్ ఇస్మార్ట్’), విజయ్ సేతుపతి (‘ఉప్పెన’), ఫహద్ ఫాజిల్ (‘పుష్ప’) లాంటి పరభాషా నటులను భారీ పారితోషికాలు ఇచ్చి మరీ టాలీవుడ్కు తీసుకొస్తున్నారు.
స్థానిక టాలెంట్ అవసరం: ఇతర ఇండస్ట్రీల నటులు వస్తున్నా, మన తెలుగు నేటివిటీని, స్థానిక యాసను, మన ఎమోషన్స్ను పర్ఫెక్ట్గా పండించాలంటే ఇక్కడి ఆర్టిస్టులే కావాలి. సాయి కుమార్, సముద్రఖని లాంటి వాళ్లు కొన్ని పాత్రలకే పరిమితం అవుతున్నారు. ‘బలగం’ సుధాకర్ రెడ్డి లాంటి కొత్త టాలెంట్ థియేటర్ ఆర్ట్స్ నుంచి బయటకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన కథలకు మరింత ప్రాణం వస్తుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలురను రీప్లేస్ చేసే కొత్త తరం క్యారెక్టర్ ఆర్టిస్టులను టాలీవుడ్ వెతుక్కునే పనిలో ఉంది.
మరి మీరేమంటారు ఇతర బాషా నటులు మన తెలుగు ఇండస్ట్రీ కి రావడం ఎలా చూడాలి అంటారు కామెంట్స్ లో తెలియ చేయండి.
