OTT Updates

మల్టీప్లెక్స్ vs సింగిల్ స్క్రీన్: టికెట్ రేట్ల పెంపుతో సామాన్యుడికి సినిమా దూరమవుతోందా?

సినిమా అనేది సగటు భారతీయుడికి అత్యంత చవకైన వినోద సాధనం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ (నలుగురు) వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్లి ఒక పెద్ద సినిమా చూడాలంటే వణుకు పుడుతోంది. ఒకప్పుడు పండగ వాతావరణంలా ఉండే థియేటర్ అనుభవం, ఇప్పుడు జేబులు గుల్ల చేసే వ్యవహారంగా మారింది. కారణం.. విపరీతంగా పెరిగిపోయిన టికెట్ రేట్లు (Ticket Price Hike).

రూ. 2000 అవుతున్న ‘సినిమా’ ఖర్చు: ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దగ్గర పర్మిషన్లు తెచ్చుకుని సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 200 కు పైగా, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 నుంచి రూ. 400 పైగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. దీనికి పాప్ కార్న్, కూల్ డ్రింక్, పార్కింగ్ ఖర్చులు కలిపితే సగటున ఒక కుటుంబానికి రూ. 2000 నుంచి రూ. 2500 ఖర్చు అవుతోంది. ఈ భారం మోయలేక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తున్నారు. నిజాం బాక్సాఫీస్ ట్రెండ్స్ గమనిస్తే, ఫస్ట్ వీకెండ్ భారీ కలెక్షన్స్ వస్తున్నా, సోమవారం నాటికి థియేటర్లలో డ్రాప్ రేట్ దారుణంగా ఉంటోంది.

నిర్మాతలకు లాభమా? నష్టమా? రేట్లు పెంచితే ఓపెనింగ్స్ వస్తాయి, తొందరగా బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు అనేది నిర్మాతల ఆలోచన. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోవడం వల్ల, లాంగ్ రన్‌లో (రెండో వారం) సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు. ప్రేక్షకులు కూడా “ఈ రేట్లు పెట్టి చూసే బదులు, నాలుగు వారాలు ఆగితే ఓటీటీ (OTT) లో వచ్చేస్తుంది కదా” అనే నిర్ణయానికి వచ్చేశారు. లాంగ్ రన్ లేకుండా కేవలం వీకెండ్ మీదే ఆధారపడటం ఇండస్ట్రీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఒక స్థిరమైన విధానం తీసుకురాకపోతే, సామాన్యుడికి సినిమా శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది.

మరి మీరు ఎందులో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు కామెంట్ బాక్స్ లో రాయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *